“ ప్రియమైన విద్యార్థులారా !
సైన్సులో
మీకు ‘ సూర్యుడు – శక్తి ‘ పాఠం ఉంది కదా ! మీ సైన్సు టీచరు సూర్య గోళాన్ని గురించి ఏమి
చెబుతాడు ? వాయువుల తోటి మండే గోళమని కదా ! మరి తెలుగు
పాఠాన్ని బోధిస్తూ మీ తెలుగు టీచర్ ఏమి చెబుతాడు? సూర్యనారాయణుడనీ , దేవుడనీ కదా !
అంటే మీ
పాఠశాలలో ఒకే అంశానికి రెండు విరుధ్ధ భావనలు బోధించి మిమ్మల్ని సందిగ్ధంలో
పడవేస్తున్నారన్నమాట ! ఇందులో ఏది నిజమో
పరిశీలించండి . శాస్త్రీయంగా నిరూపింప బడేదే సత్యం . శాస్త్రీయంగా నిరూపించ లేనిది
అసత్యమే కదా మరి ! పాఠశాలలో అసత్యాలు బోధించడం సముచితమేనా ?
సూర్యుడు
కేవలం వాయువులతో నిండి నిరంతరం మండే వాయుగోళం . ఇది శాస్త్రీయంగా నిరూపించ బడింది
. ఇది సత్యం . సూర్యున్ని భగవంతుడుగా చిత్రీకరించే కథలన్నీ అసత్యాలు ..... “
--- ఇలా అనర్గళంగా సాగిపోతూ ఉంది ఆనాటి పాఠశాల సమావేశంలో ఒక మేథావి ఉపన్యాసం .
ఆ మేథావి ఆనాటి సమావేశానికి ప్రత్యేకంగా విచ్చేసిన విశిష్ట ఉపన్యాసకులు . మీదు
మిక్కిలి హేతువాది . సదరు ఉపన్యాసకులు మంచి స్ఫురద్రూపి . మంచి వాగ్ధాటితో ,
చతురోక్తులతో విద్యార్థులను ఆకట్టుకొని మంత్ర ముగ్ధులను చేస్తున్నాడు .
ఇంతలో ఆపాఠశాల తెలుగు టీచర్
వేదిక మీదకు వచ్చి , తనకూ సదరు అంశం మీద మాటాడ్డానికి అవకాశం ఇవ్వవలసినదిగా
సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న హెడ్మాష్టరు గారిని కోరినాడు .
ప్రధానోపాధ్యాయుని సంశయాన్ని
గమనించిన హేతువాది తన ఉపన్యాసాన్ని అర్థాంతరంగా ఆపి , తెలుగు టీచర్ను మాటాడ
వలసినదిగా కోరినాడు . సమావేశ వేదిక కాస్తా చర్చావేదికగా మారింది .
వేదిక మీదకు వచ్చిన తెలుగు
ఉపాధ్యాయుడు విద్యార్థుల లో కొంత మందిని లేపి
వారి తల్లి దండ్రుల వేర్లు చెప్పవలసినదిగా కోరినాడు . వారు చెప్పినారు . “మీరు మీ తల్లిదండ్రులను
ఏమని పిలుస్తారు? “ టీచరు ప్రశ్న
“అమ్మా – అనీ , నానా – అనీ “ పిల్లల సమాధానం
“ పేర్లతో పిలవరా ? “ టీచరు
“ తప్పుకదండీ ! “ పిల్లలు
ప్రియమైన విద్యార్థులారా! తల్లిదండ్రుల మీదా , గురువుల మీదా , పెద్దల మీదా మనకుండే గౌరవం వల్ల మనం వాళ్లను
పేర్లతో సంబోధించడం తప్పుగా భావిస్తున్నాము .
సూర్యుడు మండే గోళం మాత్రమే
కాదు . సూర్యుడు భూమిమీది సర్వజీవ రాశికీ శక్తి ప్రదాత . సూర్యగోళం నుండి వెలువడే
అనంతమైన శక్తి వల్లనే ఈ భూమిమీది సర్వ జీవ రాశీ మనుగడ సాగిస్తోంది . సూర్యకిరణాలు
భూమికి చేరని నాడు భూమిపై జీవరాశి నశిస్తుంది . ఇది కూడా శాస్త్రీయ మైన అంశమే .
మన మనుగడ కు నిరంతరం శక్తిని
ప్రసాదించే సూర్యుణ్ణి గౌరవించి , దైవంగా భావించి , ఆరాధించడం ఎంత మాత్రమూ
తప్పు కాదు . మానవ జాతి మనుగడకు దోహద కారులైన ఏ అంశాలనైనా గౌరవించి దైవంగా భావించి
, ఆరాధించడం అనాదిగా వస్తున్న భారతీయ సంస్కృతీ –సంప్రదాయాల లో ఉన్న గొప్పదనం .
భారతీయ సంస్కృతి మానవజాతి ఉన్నతికి ప్రతీక .
ఇలాగే నేల . నేలంటే మన్నేకదా !
ఈ నేలే మనకు ఆధారం . ఇందులోనే మనం ఆహారాన్ని
పండించు కొంటున్నాం . అందరికీ అన్నం పెట్టే నేలను తల్లీ అనడం తప్పా? అనక పోవడం తప్పా ?
నీరు , గాలి . ప్రకృతి – ఇలా మన
మనుగడకు ప్రత్యక్షంగా గానీ , పరోక్షంగా గానీ దోహదకారులయ్యే ప్రతి అంశాన్నీ విథిగా
గౌరవించాలి .
అందుకే సూర్యణ్ణి
సూర్యభగవానుడనీ , నేలను నేలతల్లిగా , ప్రకృతిని ప్రకృతి మాతగా మనం గౌరవించడం –
ఆరాధించడం నేర్చుకున్నాము . గౌరవించక పోవడం తప్పు . ఆరాధించక పోవడం నేరం . అనాదిగా
మనకు సంక్రమించిన ఈ సంప్రదాయాన్ని వదులుకోవద్దు . “ అని ముగించినాడు . కరతాళ ధ్వనులతో సమావేశ మందిరం మారు మ్రోగింది . పాపం
హేతువాది ఎటు వెళ్ళేడో మరి !