Monday, August 4, 2014

సర్కారీ బడులు

సర్కారు బడిజెప్పు సార్లకు పట్టదు
చేతి నిండ రియలెస్టేటు వల్ల
పర్యవేక్షకులకు పట్టదు పనితీరు
విద్యానిధులు బొక్కు విధుల వల్ల
పాఠశాలల బాగు పట్టదు నేతకు
కార్పొరేటు బడుల కలిమి వల్ల
బిడ్డల చదువులు పెద్దవారెరుగరు
జీవన పోరాట స్థితుల వల్ల

వెరసి - గ్రామీణ బడులలో వెలయు చదువు
చిత్తశుధ్ధికి దూరమై ఛిద్రమైన
తీరు తెన్నుల భాసించు తీరు చూడ
చదువు మృగ్యము సర్కారు సాగు బడుల .

Friday, July 4, 2014

THE LADDER ( ఇది ఒక నిచ్చెన గారి అంతరంగం )

నమస్తే సార్ !” అంటూ వచ్చి నేల చూపులు చూస్తూ నిలబడ్డారు, పది పన్నెండు మంది యెడ పిల్లలు .
అంతా పదిహేడు పద్దెనిమిదేళ్ళ వయసులో ఉన్న యువకులు .
ఏమిట్రా ఇలా వచ్చారు, అంతా కులాసాయేనా     ప్రేమగా పలుకరించాడు హెడ్మాష్టరు సారు .
                 అది మే నెల . స్కూళ్లకూ , కాలేజీలకూ వేసవి సెలవలు . ఐనా , పాఠశాల ప్రధానోపాధ్యాయుడూ , గుమాస్తా , అటెండరూ రోజూ వచ్చి , టపాలు చూచుకుని , వాటికి సమాధానాలు పంపడం , అవసరమైన పిల్లలకు టీసీలు ,
స్టడీ సర్టిఫికేట్లూ వగైరాలు ఇవ్వడం , అటెస్టేషన్లు చేసి పంపడం చేస్తుంటారు .
               వచ్చిన పిల్లలంతా ఆవూరి వాళ్లే . అందులో కొంత మంది అదే స్కూల్లో పది దాకా చదువుకొన్న వాళ్ళే .
తమ వద్ద చదువుకున్నవాళ్లు మళ్ళీ కనిపించి పలకరించి నమస్కరిస్తే , అదేమిటో ఈ టీచర్లు ఏనుగు నెక్కేస్తారు .
ఇదీ వొక రకమైన బలహీనతే నేమో !
           ఆ రామానాయుడు గారబ్బాయి చూచావూ , మనోహర్ , ఇప్పుడు జిల్లా కలెక్టరు , నేనే వాడికి మేద్స్ నేర్పించింది .
           ఇలా పదే పదే చెప్పుకుని మరీ మురిసి పోతుంటారీ బడుగు జీవులు . తనమీదనుంచి మెట్లెక్కి ఎందరో పైపైకి  పోతున్నా , ఇసుమంతైనా అసూయ పడడు సరికదా , పైపెచ్చు వాళ్లను చూచి మురిసి పోతూ , నేలపైనే
ఉంటాడు , నిచ్చెన లాగా .  ఎంత వెర్రిబాగులోడో కదా !
          సార్ వచ్చే ఆది వారం ఫ్రెండ్లీ మేచుందండీ , మీరు పర్మిషనిస్తే , మన గ్రౌండ్ లో  ప్రాక్టీస్ చేసుకుందాం అన్నారు
అబ్బాయిలు మొహాలు దీనంగా పెట్టి , అయ్యగారి విషయం తెలుసు కాబట్టి , అనుమతిస్తాడో లోదో అనే
అనుమానంతో .
           సెలవులేగా , ఏం ఫర్లేదు , ప్రాక్టీసు చేసుకోండి నిక్షేపంగా అని ఒక్కొక్కరినీ పేరు పేరునా పలకరించి
యోగ క్షేమాలు విచారించాడు పెద్దయ్యవారు .
ఏరా ఆనంద్ ఏం చేస్తున్నావ్
బీటెక్ ఫస్టియర్ సార్
తులసీ నువ్వేం చేస్తున్నావ్
నేను కూడా బీటెక్ ఫస్టియర్ సార్ అదే కాలేజీలో
నువ్వురా కాశీ
నేను మెడిసిన్ లో జాయినయ్యాన్ సార్
విశ్వేశ్వర్
టీటీసీలో చేరా సార్
         మిగతా వాళ్లు ఏమి చేస్తున్నదీ తెలుసు కాబట్టి ప్రశ్నించ లేదు వాళ్లను . వాళ్ళను అలా చూచి నప్పుడల్లా సారుకి
కొంచెం బాధ .
విశ్వేశ్వర్ బ్రామ్మడు , ఆనంద్ కూడా ఉన్నత వర్గాలకు చెందిన వాడు .
తులసీ , కాశీ ఉద్యోగస్తుల పిల్లలు . ఎస్సీ వర్గం .
రవి , నరిసింహులు , శీను , మరియన్న , పెంచలయ్య వగైరాలు మిగిల వాళ్ళు .
రవి , నరిసింహులు , మరియన్న , పెంచలయ్య ఎస్సీ వర్గం . శీను వగైరాలు బీసీ వర్గం .
వీళ్ల వరకూ సదరు హైస్కూల్లోనే పది వరకు చదివి , ముగించి కూలి పనుల కెల్తున్నారు .
ఫ్రెండ్సంతా కలుసు కోవడంతో సరదాగా క్రికెట్ మాచ్ పెట్టుకున్నారు . పిల్లలంతా గ్రౌండ్ లో కెళ్లారు .
           సారు మాత్రం ఆలోచనలో పడ్డాడు ..........
ఇంజనీర్లూ , ఢాక్టర్లూ కాలేక పోయినా – వీళ్ళు కూడా కనీసం చిన్న చిన్న ఉద్యోగాల్లో నైనా స్థిరపడి ఉంటే
తరతరాలుగా ఈ కూలి బతుకులు తప్పేవిగా .
         కానీ పాపం వీళ్ళకు రిజర్వేషన్ లున్నా వాటి ఫలాలు అనుభవించే అవకాశాలు అస్సలు లేవు గదా .
రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవితాలు . కాస్త వయస్సు కొచ్చారంటే కూలి కెల్లాల్సిందే , కడుపు నింపు
కోడానికి . ఇంకెక్కడి రిజర్వేషన్లు . ఇలా సాగుతోంది , నిచ్చెన గారి అంతరంగం .........
          దలిత వర్గాల రిజర్వేషన్ ఫలాలు , ఆ వర్గాలలో కొందరికే పరిమిత మౌతున్నవి . ఆర్థికంగా నిలదొక్కుకొని
ఉండడం వల్ల , తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న కుటుంబాల పిల్లలకు అన్ని అవకాశాలూ కలిసి
వచ్చి , ఉన్నత చదువులలో గానీ , ఉద్యోగాలలో గానీ  వీళ్లే రిజర్వోషన్ల ఫలాలు అంది పుచ్చుకో గల్గుతున్నారు .
ఉద్యోగాలలో స్థిరపడి , ఆర్థికంగా నిలదొక్కుకున్న కుటుంబాల పిల్లలతో , కూలి నాలి చేసుకుంటూ పూట గడుపు
కునే వారి పిల్లలు చదువులో పోటీపడి రిజర్వేషన్ ఫలాలు పొంద గలగడం సాధ్యమయ్యే పనేనా .
           ఆర్థికంగా వెసులుబాటు లేక , దిన దినం బతుకు పోరాటంలో మ్రగ్గి పోతున్న గ్రామీణ భారతం లోని
తొంబై శాతం పైగా ధళితులు తరతరాలుగా కూలి బతుకులు బతక వలసిందేనా . వీళ్ళకు రాజ్యాంగ పరంగా
సంక్రమించిన రిజర్వేషన్ ఫలాలు అంది పుచ్చు కునే మార్గమే లేదా .
        ఉంది . ఒకసారి రిజర్వేషన్ పరంగా ఉద్యోగం పొందిన కుటుంబాన్ని , రిజర్వేషన్ పరిధి నుంచి ఎలిమినేట్
చేసి , జనరల్ పరిధిలోకి మార్చాలి . ఇలా , ప్రభుత్వ , ప్రభుత్వేతర అన్నిరంగాలలో రిజర్వేషన్లద్వారా
లబ్ధి పొందిన కుటుంబాలను మళ్లీ రజర్వేషన్ కోటాలోకి ప్రవేసించనీయరాదు . రిజర్వుడు స్థానాలలో
పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధులకు కూడా ఈ పధ్ధతి అమలు చేయాలి .
     ఇలా చేస్తే , అందరికీ వాటంతట అవే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి . అందరూ ఆర్ధికంగా నిల
దొక్కుకుంటారు . ఆర్ధికంగా నిల దొక్కుకున్న కుటుంబాలు సామాజికంగా అభి వృధ్ది చెందుతాయనటంలో
సందేహంలేదు .
          .......... ఇలా సాగిపోతోంది , ఆ పెద్ద సారు మస్తిష్కంలో ఆలోచనా తరంగాలు . ఐనా ఈ నిచ్చెన గారికి
ఎంతసేపటికీ సమాజాన్ని గురించిన ఆలోచనే గాని , అందులో పది శాతమైనా , సొంత కుటుంబం
గురించి ఆలోచన చేయ గలిగితే , ఈ నిచ్చెన నేల మీదే ఉండదు గదా . ఏమిటో ! ఈ వెర్రి బాగుల వాళ్లంతా ఇంతే నేమో!  


Friday, January 3, 2014

స్థానిక సమరంలో ఓ విజయమ్మ కథ





ఏమి విజయమ్మా! ఈరోజు పిల్లలకు ఏమి వండి పెడుతున్నావు?
ఏముంది సారూ! అన్నమూ , సాంబారూ , రసమూను
అవునూ!   ఈ రోజు మంగళ వారం కదా!
అర్థమయ్యింది సారూ , మంగళవారం గుడ్లు వండాలని కదా మీరనేది
మరి ! “
ఒక్కొక్క పిలగాడికి రూపాయి పావలా ఇస్తున్నారు .  గుడ్డు రొండు రూపాయలు . వారానికి
రెండు సార్లు ఏడ దెచ్చేది . మీకు దెలవందేముంది సారూ .  అదికూడా నాలుగు నెలలకోసారి                     బిల్లు లిస్తున్నారు . బతుకు దెరువు లేక బడి పిల్లలకు వండి పెట్టడానికి ఒప్పు కుంటిని .
ఏమి చేసేది ?
     నేను గవర్ణమెంటు హైస్కూలు ప్రథానోపాధ్యాయులుగా ఉద్యోగం వెలగబెట్టినప్పటి ముచ్చట .                   నా స్కూల్ కాంప్లెక్సు పరిధిలోని కొన్ని ప్రాథమిక పాఠశాలలు సందర్శించిన సందర్భమిది .  
                                         -----
     పదేళ్ళ క్రితం ఈ విజయమ్మ ఆ మండలానికి మండలాథ్యక్షురాలు . ఆ వూరి యం.పి.టి.సి
యస్.సి మహిళకు రిజర్వు కావడం వల్లా , ఆ ఊరి చక్రం తిప్పే బడా నేత ఎంపిక చేయడం వల్లా
విజయమ్మ యం.పి.టి.సి అయ్యింది .
      మండలాథ్యక్ష పదవి కూడా జనరల్ మహిళకు రిజర్వు కావడం వల్లా - మండలంలో
గెలిచిన యం.పి.టి.సి లలో విజయమ్మ ఒక్కరే మహిళ కావడం వల్లా అనూహ్యంగా మండలా
థ్యక్ష పదవి ఆమెను వరించింది .
        అంతకు క్రితం ఆ మండలానికి మండలాథ్యక్షుడుగా ఉన్న ఉన్నత సామాజిక వర్గానికి
చెందిన రాజకీయ నాయకుడు బలాఢ్యుడు . అంగ బలం , అర్థ బలంతో ఆ మండలంలో ఆయన హవానే                      నడుస్తూ ఉంది .
        ఇక షరా మామూలే . మండలాథ్యక్షురాలు విజయమ్మ ప్రతిరోజూ పొద్దున్నే సదరు శ్రీవారి
ఇంటికి వెళ్ళడం , సాయంత్రం వరకూ ఆయింటి యజమానురాలు చెప్పిన పనులు చేయడం ,                           రాత్రికి ఇల్లు చేరడం – ఇదీ విజయమ్మ దిన చర్య .
        విజయమ్మకు పొడి పొడిగా సంతకం చేయడం నేర్పించినారు . చెక్కులూ , ఉత్తర్వులూ ,
తదితరాల మీద అయ్యగారి ఇష్టాయిష్ఠాల మేరకు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టడం ,
అప్పుడప్పుడు జరిగే సమావేశాలలో ఒక అనామకురాలి లాగా బిక్కు బిక్కుమంటూ కూర్చోడంవరకే.
        అధికారులూ , అనధి కారులూ ఆమెనసలు మండలాథ్యక్షురాలిగా భావించిన దాఖలాలు
కనబడవు . అధికారమూ . ఆర్భాటమూ అంతా ఆ పెద్దాయనదే మరి . విజయమ్మ నామ మా
త్రం గానే మిగిలి పోయింది . పదవి పోయిన తర్వాత బతుకు తెరువు కోసం నానా పాట్లూ పడుతున్న
ఇలాంటి విజయమ్మలను చూస్తున్నప్పుడు మనస్సు చివుక్కు మంటోంది . ఇది పదేళ్ళ నాటి
సంగతి . ఐనా , మార్పు కోసం ఆసించడం తప్ప ఎక్కడా ఆ ధాఖలాలు సుదూరంగా కూడా                    కనిపించడం లేదు .
                                        -----  
         ఉన్నత సామాజిక వర్గాల మహిళలతో సహా స్త్రీలూ , బడుగు – బలహీన వర్గాలూ స్థానిక
రిజర్వేషన్ల ద్వారా అందిన పదవులను అనుభవించే పరిస్థితులే లేవు . అధికారమంతా రాజకీయ ,
సామాజిక , ఆర్థిక బలాఢ్యుల చేతుల్లోకి బదిలీ అవుతున్నప్పుడు , బడుగు బలహీన వర్గాల అభ్యున్న
తి ప్రశ్నార్థకమే .
         ఈ సామాజిక దురవస్థకు కారణం మనకు తెలుసు . నిరోధించడానికి మన బాధ్యతగా ఈ సమాజానికి మనమేమి చెప్పాలో యోచించండి .